హైదరాబాద్, వెలుగు: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి ప్రాణహాని ఉందని.. తనకు సెక్యూరిటీ పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులను కోరారు. బుధవారం లా అండ్ ఆర్డర్ డీజీ సంజయ్ జోషిని కలిసి దరఖాస్తు అందిచారు. తర్వాత డీజీపీ ఆఫీసు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు, మంత్రుల మీద చేస్తున్న కామెంట్స్తో తనకు గతేడాది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రాకు వ్యతిరేకంగా పోరాడాడని మహారాష్ట్రలో సతీశ్ అనే వ్యక్తిని హత్య చేశారు. సీబీఐ విచారణ కూడా జరుగుతున్నది. ఓఆర్ఆర్ టెండర్స్పై నేను కూడా కామెంట్స్ చేశాను. అందుకే నాకు ప్రాణభయం ఉంది. ఈ వివరాలను లా అండ్ ఆర్డర్ డీజీకి వివరించాను’’ అని రఘునందన్ చెప్పారు. భద్రత రెట్టింపు చేయాలని కోరానని తెలిపారు.
పోలీస్ వెహికల్స్ డేటా పరిశీలన
పోలీస్ డిపార్ట్మెంట్లో వెహికల్స్ కొనుగోలు, మెయింటనెన్స్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రఘునందన్ రావు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వివరాలు పేపర్ ద్వారా ఇవ్వలేమని, స్వయంగా వచ్చి తెలుసుకోవాలని అధికారులు సూచించడంతో ఆయన బుధవారం ఉదయం11 గంటలకు డీజీపీ ఆఫీస్కు వచ్చారు. డీజీపీ అంజనీకుమార్ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ జోషిని కలిశారు. 2014, జూన్ 2 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనుగోలు చేసిన బస్సులు, ఫ్రార్చునర్లు, ఇన్నోవాలు, బైక్స్ సహా ఇతర వాహనాలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు రఘునందన్ చెప్పారు.
హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ అధికారులపై అసంతృప్తి
హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ కలెక్షన్కు సంబంధించి ఏప్రిల్ నెల ఆదాయ వివరాలు తెలుసుకునేందుకు బుధవారం నానక్ రాంగూడలోని గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీసుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లారు. మధ్యాహ్నం 12.40 గంటలైనా ఆఫీసులో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. టోల్ వ్యవహారాలు చూసే ఐఏఎస్ అధికారి సంతోష్ను టీఎస్పీఎస్సీకి బదిలీ చేశారని, ఆయన స్థానంలో ఆరేండ్ల క్రితం రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని ప్రభుత్వం నియమించిందన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఆఫీసుకు వచ్చి ఇన్చార్జ్ ఎండీ, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించాలని కోరారు.