గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకులు వస్తే, తమ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పుకోకుండా సీఎం కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని ప్రశ్నించారు ఆ పార్టీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. భాగ్యనగరంలో భాజాపా జాతీయ నాయకులు ప్రచారానికి వస్తుంటే కేసీఆర్ బెంబేలెత్తుతున్నాడని ఆయన అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో లో రఘునందన్ మాట్లాడుతూ.. ఏడాది క్రితం హుజూర్ నగర్ ఎన్నికలలో కేవలం ఆ జిల్లాకు చెందిన వారు మాత్రమే ప్రచారంలో పాల్గొనకుండా, తెరాస ప్రభుత్వ మంత్రులందరూ ప్రచారం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు.
భాజాపా నాయకులు ఎవరు కూడా సంస్కృతికి, సాంప్రదాయలకు విరుద్ధంగా మాట్లాడటం లేదని, భాషను, యాసను ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతూ తెరాస నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ చేతనైతే చేసింది చెప్పాలి అంతేకానీ ఎక్కువ మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. ఈ జి.హెచ్.యం.సి ఎన్నికలలో మేయర్ పీఠానికి సరిపడ సీట్లను తమ పార్టీ గెలుచుకోనుందని రఘునందన్ అన్నారు.