వాళ్లు అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులు  : రఘునందన్​రావు 

వాళ్లు అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులు  :  రఘునందన్​రావు 
  • దుబ్బాకకు కేటాయించిన నిధులపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలి

దుబ్బాక, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు దుబ్బాకకు అప్పుడప్పుడు వచ్చిపోయే టూరిస్టులని, వాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలు దుబ్బాక ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే రఘునందన్​రావు ఎద్దేవా చేశారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. రఘునందన్​రావు గెలిచాక దుబ్బాక నియోజకవర్గానికి ఏం చేశాడో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. దుబ్బాకకు ఏం చేశారని తండ్రి, కొడుకు, అల్లుడు వరుసబెట్టి వస్తున్నారని ప్రశ్నించారు.

ఇక్కడే తిరిగా, ఇక్కడే చదివా అని  చెప్పుకునే సీఎం కేసీఆర్​ దుబ్బాకకు కేటాయించిన నిధులపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్​ చేశారు. దుబ్బాకకు వచ్చిన నిధులన్నీ అడ్డదారిలో మంత్రి హరీశ్​రావు తీసుకపోయినప్పుడు ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ఎందుకు అడ్డుకోలేదన్నారు. దుబ్బాక ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే రఘునందన్​రావు ఊరుకోరని హెచ్చరించారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే దుబ్బాకను రెవెన్యూ డివిజన్​, రింగ్​ రోడ్డు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ గెలవకుంటే ఇవ్వరా అని నిలదీశారు. కత్తి పోటు డ్రామాలతో కన్నీళ్లు పెట్టుకుంటే ఓట్లు రాలవని, ప్రభాకర్​ రెడ్డి ఓడిపోయాక సిద్దిపేటలో పబ్​పెట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది రఘునందన్​రావు అని, ఉద్యమం పేరుతో దోచుకున్నది సీఎం కేసీఆర్​ అని, అగ్గిపెట్టె మంత్రి హరీశ్​​రావు పెట్రోల్​ పోసుకున్నప్పుడు నేనే పక్కనే ఉన్నానని, నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు చెబితే కేసీఆర్, హరీశ్​​రావు ఉరేసుకుంటారని చెప్పారు. 

బీఆర్‌‌ఎస్​ డబ్బులు తీసుకొని బీజేపీకి ఓటెయ్యండి

ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి పదేండ్లుగా దోచుకున్న డబ్బులను తీసుకొని బీజేపీకి ఓటేసి తనను గెలిపించాలని రఘునందన్​రావు కోరారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. మండల అభివృద్ధి ఏనాడూ పట్టించుకోని ఎంపీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పేదలకు చెందిన అసైన్డ్​ భూములను నిషేధిత జాబితాలో పెట్టి కేసీఆర్​ కుటుంబం అడ్డదారిలో అక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సిద్దిపేటలో కలెక్టరేట్​ భవనాన్ని దళితుల భూముల్లోనే నిర్మించారని ఆరోపించారు. మిరుదొడ్డి మండలం బీజేపీకి, కరసేవకులకు అడ్డా అని, బీజేపీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు.