మంత్రి, ఎంపీపై కేసు నమోదు చేయాలి : రఘునందన్​రావు

మంత్రి, ఎంపీపై కేసు నమోదు చేయాలి : రఘునందన్​రావు

గజ్వేల్, వెలుగు : అహంకారంతో దేశ ప్రధాని ఫ్లెక్సీని చింపించి, టీవీ స్ర్కీన్​పై వస్తున్న ఆయన బొమ్మను కాలితో తన్నిన మంత్రి హరీశ్​రావు, ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సిద్దిపేట సీపీని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్​రావు కోరారు. వచ్చే ఎన్నికల్లో  ప్రజలు వారికి గట్టిగా బుద్ది చెబుతారన్నారు. మంగళవారం సిద్దిపేట నుంచి గజ్వేల్ కు ప్యాసింజర్  రైల్​లో చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వర్చువల్ గా సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభిస్తే మంత్రి హరీశ్​రావు, బీఆర్​ఎస్​ నాయకులు వారి పార్టీ కార్యక్రమంలా వ్యవహరించడం ఎంతవరకు సమంజమన్నారు.

దేశ ప్రధాని ఫెక్సీని చింపడం, టీవీలోని ఆయన బొమ్మను తన్నడం దారుణమన్నారు. వెంటనే మంత్రి హరీశ్​రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణలు  చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ఈ ఘటనను  పార్ల మెంట్, ప్రధాని పార్లమెంట్ ప్రి విలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఆయన వెంటన బీజేపీ నాయకులు ధరం గురువారెడ్డి, నందన్​గౌడ్​, నలగామ శ్రీనివాస్, కప్పర ప్రసాద్​రావు, పేర్ల శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు. 

ఆత్మాభిమానాన్ని రెచ్చగోడితే గుణపాఠం తప్పదు

దుబ్బాక, వెలుగు : దుబ్బాక నియోజకవర్గానికి మంత్రి హరీశ్​రావు వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని రెచ్చ గొట్టే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మంత్రి, ఎంపీకి గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే రఘునందన్​ రావు హెచ్చరించారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికలో మంత్రి, ఎంపీలకు కర్రు కాల్చి వాతలు పెట్టినా మార్పు రాలేదన్నారు. రామలింగన్న నియోజకవర్గానికి సేవలు

చేశారని చెప్పే మంత్రి సోలిపేట కుటుంబానికి టిక్కెట్​ ఇవ్వకుండా డబ్బున్న ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డికి ఎంతకు అమ్ముకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. పదేండ్లలో సిద్దిపేట కోమటి చెరువుకు పెట్టిన డబ్బులు, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పెట్టిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. మంత్రి హోదాలో ఉన్న హరీశ్​రావు బీఆర్​ఎస్​అభ్యర్థి గెలిస్తేనే దుబ్బాక అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

2018లో పూర్తయిన ఇండ్లను ఇవ్వకుండా మంత్రి కుట్ర చేశారని, తానే స్వయంగా రంగంలోకి దిగి 2022లో పేదలకు పంపిణీ చేశానని గుర్తు చేశారు.ఉప ఎన్నికలో ప్రెస్​ క్లబ్​ నిర్మాణానికి ఇచ్చిన రూ. 25 లక్షల ప్రోసిడింగ్​ ఎక్కడపోయిందని, జర్నలిస్టులకు డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు​, ప్లాట్లు ఎక్కడికి పోయాయో మంత్రి సమాధానం చెప్పాలన్నారు.