- రాష్ట్రానికి 20వేల కోట్ల నష్టం
- అర్హతలు మార్చడంపై అసెంబ్లీలో రాజగోపాల్రెడ్డి ఆరోపణ
- 20 ఏండ్లుగా పని చేస్తున్నోళ్లు కూడా క్వాలిఫై కారా? అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: టెండర్ రూల్స్ మార్చి తమకు అనుకూలమైన వారికి సింగరేణి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని.. దీంతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మూడో రోజు సభలో సింగరేణి కాలరీస్ సంస్థ ప్రైవేటీకరణపై క్వశ్చన్ అవర్ జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ప్రసంగించారు. ‘‘సింగరేణిలో ఎలాంటి పారదర్శకత లేకుండా కొందరిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ లేని అర్హతలు నిర్ణయించారు. 20ఏండ్ల నుంచి సింగరేణిలో పనులు చేస్తున్న ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈ అర్హతల ప్రకారం క్వాలిఫై కాలేదు. కొందరు పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి రూ.20వేల కోట్ల నష్టం వస్తుంది”అని ఆరోపించారు.
దీంతో బాల్క సుమన్ జోక్యం చేసుకుని ప్రసంగానికి అడ్డుతగిలారు. సబ్జెక్ట్ను డీవియేట్ చేస్తున్నారని అన్నారు. ఒకనొక సందర్భంలో స్పీకర్పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ ఎట్ల ఇస్తరని మండిపడ్డారు. దీంతో స్పీకర్ వెంటనే మైక్ కట్ చేశారు. తర్వాత సుమన్ ప్రసంగిస్తుండగా.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పదేపదే స్పీకర్ను కోరారు. దీంతో స్పీకర్ మరోసారి మైక్ ఇచ్చారు. ‘‘మీకు నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉన్నోళ్లు చెబితే వినరు. మళ్లీ మాకే తెలివిలేదు అంటరు’’ అని రాజగోపాల్ రెడ్డి కామెంట్చేసి తన సీట్లో కూర్చున్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి దగ్గరకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి మాట్లాడారు.