చిత్తూరు: పీఐఐసీ చైర్పర్సన్, నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ నగరిలో అంబులెన్స్ బైక్ ల ప్రారంభోత్సవం చేశారు. స్వయంగా బైకు నడిపి స్థానికులను హుషారెత్తించారు. శ్రీసిటీ హీరో మోటార్ సంస్థ పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్ బైక్లను విరాళంగా ప్రకటించింది. వీటిని ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా అందజేసింది. ఈ సందర్భంగా జెండా ఊపి అంబులెన్స్ బైకులను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా.. కొద్దిసేపటి తర్వాత.. స్వయంగా బైకు నడిపి అందరినీ ఆశ్చర్యపరచారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1: రోజా
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్ జగన్పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ ర్యాంకును కూడా టీడీపీ తమ ఘనతేనని చెప్పుకోవడం వారి చీప్ పాలిటిక్స్కు నిదర్శనం అని ఆమె ధ్వజమెత్తారు.