మల్టీ యూనివర్సిటీ క్యాంపస్‌‌ పెట్టండి...కెనడా హైకమిషనర్‌‌ క్రిస్‌‌ కూటర్ను కోరిన సీఎం రేవంత్‌‌ రెడ్డి

మల్టీ యూనివర్సిటీ క్యాంపస్‌‌ పెట్టండి...కెనడా హైకమిషనర్‌‌ క్రిస్‌‌ కూటర్ను కోరిన సీఎం రేవంత్‌‌ రెడ్డి
  •     కెనడా పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్‌‌గా మారిందని వ్యాఖ్య
  •     డిసెంబర్‌‌లో జరిగే గ్లోబల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ సమిట్‌‌కు రావాలని క్రిస్‌‌కు ఆహ్వానం
  •     రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి కెనడా సుముఖత
  •     సీఎం రేవంత్‌‌ రెడ్డి బృందాన్ని కెనడాకు ఆహ్వానించిన హైకమిషనర్‌‌

హైదరాబాద్, వెలుగు: కెనడా యూనివర్సిటీలతో హైదరాబాద్‌‌లో మల్టీ- యూనివర్సిటీ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌‌ రెడ్డి కోరారు. బుధవారం కెనడా హైకమిషనర్‌‌ ఇండియా క్రిస్‌‌ కూటర్‌‌తో ఎంసీహెచ్‌‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సందర్భంగా సీఎం ఈ  ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఐటీ, లైఫ్‌‌ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్‌‌ రంగాల్లో సాధించిన పురోగతిని వివరించిన సీఎం, కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను ఈ ఏడాది డిసెంబర్‌‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ సమిట్‌‌’కు ఆహ్వానించారు. 

తెలంగాణను ప్రపంచ స్థాయి ‘నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలు హైదరాబాద్‌‌లో క్యాంపస్‌‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని, అందుకే కెనడాకు చెందిన టాప్‌‌ వర్సిటీలు సైతం ఇక్కడ మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన యువత, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు ఆదర్శప్రాయమని హైకమిషనర్‌‌ ఈ సందర్భంగా ప్రశంసించారు.

మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్‌‌ మెట్రో రైలు విస్తరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ వంటి మెగా మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మూసీ నదీ తీరాన్ని అభివృద్ధి చేసి సరికొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌‌ వివరించారు. ఈ ప్రాజెక్టులతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, సౌర విద్యుత్‌‌ విస్తరణకు కెనడా సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ చొరవను అభినందించిన హైకమిషనర్, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై సానుకూలంగా స్పందించారు.

తెలంగాణపై కెనడా కంపెనీల నమ్మకం..

ఇటీవల కాలంలో కెనడాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తెలంగాణను తమ పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకోవడంపై క్రిస్‌‌ కూటర్‌‌ సంతోషం వ్యక్తం చేశారు. ఫిరాన్‌‌ టెక్నాలజీ గ్రూప్‌‌ హైదరాబాద్‌‌లో తయారీ యూనిట్‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ తన గ్లోబల్‌‌ కెపాబిలిటీ సెంటర్‌‌ను ఇక్కడే ప్రారంభించడం తెలంగాణపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, ప్రముఖ క్యాపిటల్‌‌ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌.. హైదరాబాద్‌‌కు చెందిన కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్‌‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకొని సుమారు ఒక బిలియన్‌‌ కెనడియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని మరింత పెంచిందని కొనియాడారు.

 సీఎంకు కెనడా ఆహ్వానం..

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని హైకమిషనర్‌‌ క్రిస్‌‌ కూటర్‌‌ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారిక ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాబోయే నెలల్లో కెనడాకు చెందిన ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటించి.. ఇంధన, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్‌‌ తదితర రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపై క్షేత్రస్థాయి చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్‌‌ తెలంగాణ సీఈఓ బి.అజిత్‌‌ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ శాఖ జాయింట్‌‌ సెక్రటరీ అనుదీప్‌‌ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌‌ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.