ఘట్ కేసర్, వెలుగు : పోచారం మున్సిపాలిటీ పరిధి పోచారం గ్రామపెద్దలు, దాతల సహకారంతో కొత్తగా నిర్మించిన మహంకాళి, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన, బోనాల పండగ ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై బంగారు బోనం ఎత్తుకుని మహిళలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు.
అనంతరం ఆలయ నిర్వాహకులతో కలిసి మంత్రి మల్లారెడ్డి, కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు, స్థానిక కౌన్సిలర్ బద్దం లాస్య జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా.. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురింపించడం ఆకట్టుకుంది. ఏసీపీ నరేశ్రెడ్డి, పోచారం ఐటీ కారిడార్ సీఐ వి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగించారు.