
మహిళల రిజర్వేషన్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వచ్చే డిసెంబర్లో మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలను ఆహ్వానిస్తామని తెలిపారు.
మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్ కూడా కొట్లాడారని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. మొదటి లోక్సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఓ ప్రొఫెసర్ ఆరోపించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీన్ని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవాలని కోరారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ అనడం దారుణమని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని బీఆర్ఎస్ నాయకులను ఆమె హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్ రాని అందరికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తుందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మలేదని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.