- బీఆర్ఎస్ను ఆహ్వానించలేదు: కవిత
హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో తనకు సొంత ఎజెండా మొదట్నుంచీ ఉందని, భవిష్యత్తులో కూడా ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో అన్ని కార్యక్రమాలు పార్టీ ద్వారానే చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. జీవో 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న దీక్ష పూర్తిగా జాగృతి ఆధ్వ ర్యంలో జరుగుతుందన్నారు. ఈ దీక్షకు బీఆర్ ఎస్ సహా ఏ పార్టీని ఆహ్వానించలేదని ఆమె స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు.
‘‘జాగృతి ఆధ్వర్యంలో భవిష్య త్తులో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. బుధ వారం జీయర్ స్వామిని కలిసేందుకు వెళ్లాను. అందుకే ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు అటెండ్ కాలేదు. జీవో 3 కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అమ్మాయిలకు తీర ని నష్టం జరుగుతున్నది’’ అని కవిత అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. లిక్కర్ స్కామ్ అనేది పెద్ద కేసే కాదని, రెండున్నర ఏండ్ల నుంచి కేసును సాగదీస్తున్నారని తెలిపారు. లిక్కర్ కేసు డెయిలీ సీరియల్ అయిందని విమర్శించా రు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ గురుకులా ల్లో జరుగుతున్నవి ప్రభుత్వ హత్యలు అని తెలిపారు. బీఆర్ఎస్ పాలన నచ్చకపోవడంతో నే ప్రజలు ఓడగొట్టారని, భవిష్యత్తులో కాంగ్రెస్కు అయినా ఇదే గతి పడుతుందన్నారు. ఎదుటి వాళ్లు కత్తులు, గన్నులతో వస్తుంటే తాము ఖాళీ చేతులతో వెళ్తే పనులు కావన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే ప్రజలకే నష్టమని వ్యాఖ్యానించారు.
