హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తాను అడుగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇప్పుడు ఫూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని భారత్ జాగృతి ఆధ్వర్యంలో ప్రస్తుత సర్కారును అడుగుతున్నామని, ఏర్పాటు చేస్తారా లేదా అన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 11లోగా సానుకూల ప్రకటన చేయాలన్నారు. ఫూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 6 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో రౌండ్టేబుల్సమావేశాలు నిర్వహిస్తామని, ఈ నెల 12న ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీని ముఖ్యమంత్రి చేయాలని కవిత అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని తాము పడగొట్టాల్సిన అవసరం లేదని.. నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ నాయకులే పడగొడుతారని వ్యాఖ్యానించారు.
ప్రియాంకను ఆహ్వానిస్తే నల్లబెలూన్లతో నిరసన
పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇంద్రవెల్లి సభకు పెట్టిన ఖర్చు ఎంత, వసతులు కల్పించినందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డబ్బు చెల్లించిందా అనేదానికి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ‘‘సీఎం అన్న విషయం మరిచి ముఠామేస్త్రీలా రేవంత్ మాట్లాడుతున్నరు. రూ.500 గ్యాస్ సిలిండర్పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంకను ఆహ్వానిస్తామని సీఎం అంటున్నరు. ఆమెను ఏ హోదాలో పిలుస్తారో చెప్పాలి.
ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానిస్తే నల్లబెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుం” అని కవిత అన్నారు. రేవంత్ ప్రత్యేక విమానాల్లో తరచూ ఢిల్లీకి వెళ్లివస్తున్నారని, అందుకు ఖర్చు ఎంత అయ్యిందో సమాధానం చెప్పాలన్నారు. శిశుపాలుడి వంద పాపాలు పండినట్లుగా వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించకున్నా సీఎం, డిప్యూటీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వెంటనే కుల గణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాబోయే బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్కేటాయించాలని డిమాండ్చేశారు.