హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీని కోరారు. తెలంగాణలో మహిళలకు బీఆర్ఎస్ తక్కువ సీట్లు కేటాయించడం, మరోవైపు ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత చేసిన ఆందోళనపై తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది. దీనిపై ఆమె ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు.
వ్యక్తిగత దూషణ బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కాలం చెల్లిన మూస పద్ధతుల్లో హేళన చేయడం తగదని, మహిళలు ఉన్నతస్థానాలకు చేరుకోవడాన్ని బీజేపీ ఓర్వలేకపోతుందా అని ప్రశ్నించారు. ఇతరులపై నిందలు వేయడం మాని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదింపజేయడంపై దృష్టి పెట్టాలని కవిత అన్నారు.