
హైదరాబాద్: మావోయిస్టుల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపుతున్నారని టీజేఎస్ పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించి సీపీఐ(మావోయిస్టు) పార్టీతో శాంతి చర్చలకు పూనుకోవాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం (జూన్ 1) శాంతి చర్చల(పీస్ డైలాగ్) కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, వామపక్ష, విప్లవ పార్టీలు, పౌర, మానవ హక్కుల, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. మావోయిస్టులపై జరుగుతున్న దాడులు నిలిపివేసేందుకు చర్చలు జరగాలన్నారు. సామాజిక, ఆర్ధిక అవసరాల నేపథ్యంలో జరుగుతున్న పోరాటాలను శాంతి చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు.
సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు జరపాలని అన్నారు. కేంద్రం, మావోయిస్టులు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలని కోరారు. మావోయిస్టులతో శాంతి చర్చల కోసం పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఆపి కాల్పుల విరమణ ప్రకటించి.. కేంద్రం, మావోయిస్టులు శాంతి చర్చలు జరపడానికి మద్దతిస్తున్నామన్నారు.