
భైంసా, వెలుగు: భైంసా పట్టణ శివారులోని గడ్డెన్న సుద్దివాగు ప్రాజెక్టు వద్ద బుధవారం జిల్లా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించే చర్యలపై స్థానిక పోలీసులకు డీడీఆర్ఎఫ్ బృందం సభ్యులు అవగాహన కల్పించారు. వరదల్లో చిక్కుకున్న స్థానికులను కాపాడే విధానాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎవరైనా ప్రాజెక్టుల్లో పడి చనిపోతే వారిని బయటకు తీసే విధానాన్ని వివరించారు.
ఎస్పీ జానకీ షర్మిలా మాట్లాడుతూ.. గత ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్తరహాలో డీడీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఏఎస్పీ అవినాశ్ కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, మల్లేశ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.