రాహుల్ ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు లేదు : జగ్గారెడ్డి

రాహుల్ ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు లేదు :  జగ్గారెడ్డి
  •  బాబు, నితీశ్ దయతో ప్రధాని అయ్యారు: జగ్గారెడ్డి
  •     గాంధీ ఫ్యామిలీది త్యాగాల చరిత్ర.. బీజేపీది మోసాల చరిత్ర అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ దగ్గర సమాధానం లేదని, ఈ చర్చ దేశమంతా చూసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానిది త్యాగాల చరిత్ర అని.. మోదీ, బీజేపీది మోసాల చరిత్ర అని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘రాహుల్ గాంధీ వయస్సు గురించి మోదీ మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ వయసంత లేదు మోదీ ఏజ్. నితీశ్ కుమార్, చంద్రబాబు దయతో ప్రధాని అయ్యారు. దేశానికి రానున్న రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ మాత్రమే. శివుని ఫొటోను రాహుల్ పార్లమెంట్​లోకి  తీసుకొచ్చారు. మోదీ ఏ రోజైనా.. రాముడి ఫొటో తెచ్చారా? ప్రతిపక్ష నేతగా మోదీని రాహుల్ వెంటాడుతూనే ఉంటారు.

వచ్చే ఐదేండ్లు కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలంతా బీజేపీకి సినిమా చూపిస్తరు’’అని అన్నారు. దేశ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల సమస్యలను రాహుల్ తెలుసుకున్నారన్నారు. మోదీ మాత్రం ప్రజలను కలవలేదని, సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు.