నర్మదా (గుజరాత్): ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పేవారికి మోడీ లీడర్ అని ఆరోపించారు. ప్రజల సానుభూతి పొందేందుకు బీజేపీ లీడర్లు మళ్లీ అబద్ధాలాడుతున్నారని విమర్శించారు. నర్మదా జిల్లాలో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. ‘‘70 ఏండ్లలో కాంగ్రెస్ ఏంచేసిందని మోడీ, అమిత్షా అడుగుతున్నారు. మేము 70ఏండ్లలో ఏం చేయకపోతే.. దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు” అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
‘‘ఓటర్ల సానుభూతి పొందేందుకు తాను పేదోన్ని అని మోడీ చెప్పారు. నేను కూడా పేదవాడినే.. అంటరానివారిలో ఒకడిని. మీ చేత్తో చేసిన టీ చాలామంది తాగారు. కానీ నేను ఇచ్చిన టీ ఎవరూ తీసుకోరు. సింపథి కోసం ఇదంతా చెబుతుంటే ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. అందరూ మీ కంటే స్మార్ట్ అయ్యారు. ఒకటి లేదా రెండు సార్లు చెబితే వింటారు. కానీ మీరు ఎన్నిసార్లు అబద్ధం చెబుతారు? మీరు అబద్ధాలు చెప్పేవారికి నాయకుడు”అంటూ మోడీని ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.