గ్యాస్ సెక్టార్‌‌‌‌లోకి రూ.5.56 లక్షల కోట్ల పెట్టుబడులు

గ్యాస్ సెక్టార్‌‌‌‌లోకి రూ.5.56 లక్షల కోట్ల పెట్టుబడులు
  •     గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈఓలతో భేటీ
  •     రెన్యూవబుల్ ఎనర్జీపై ఎక్కువ ఫోకస్

న్యూఢిల్లీ: ఇంకో ఐదారేళ్లలో దేశ నేచురల్ గ్యాస్‌‌  సెక్టార్‌‌‌‌లోకి రూ.5.56 లక్షల కోట్ల (67 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.  గ్యాస్ సప్లయ్‌‌ చెయిన్‌‌ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. గోవాలో మొదలైన ఇండియా ఎనర్జీ వీక్‌‌ రెండో ఎడిషన్‌‌ (ఫిబ్రవరి 6–9) లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో   లోకల్‌‌గా నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్‌‌ పెరిగిందని వెల్లడించారు. ఇంధన వాడకంలో ప్రస్తుతం నేచురల్ గ్యాస్ వాటా  6.3 శాతం ఉందని, 2030 నాటికి ఇది 15 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.  కాగా,  2070 నాటికి  నెట్ జీరో కార్బన్ ఎమిషన్ దేశంగా మారాలని ఇండియా టార్గెట్‌‌గా పెట్టుకుంది.

ఈ ట్రాన్సిషన్‌‌లో నేచురల్ గ్యాస్‌‌కు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గ్యాస్‌‌తో ఎలక్ట్రిసిటీని  జనరేట్ చేయొచ్చు. ఫెర్టిలైజర్ల తయారీలో లేదా వెహికల్స్‌‌ కోసం సీఎన్‌‌జీ తయారీలో గ్యాస్ కీలకం. ఇంకా పెట్రోల్‌‌, డీజిల్‌‌తో పోలిస్తే  నేచురల్ గ్యాస్ వాడకంతో తక్కువ పొల్యూషన్ విడుదల అవుతుంది. ‘దేశ ఎకానమీ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో  ఫ్యూయల్ డిమాండ్ పెరుగుతోంది. ఎనర్జీ (కరెంట్‌‌), ఆయిల్‌‌, ఎల్‌‌పీజీ వాడకంలో ఇండియా  గ్లోబల్‌‌గా మూడో ప్లేస్‌‌లో ఉంది. నాల్గో అతిపెద్ద ఎల్‌‌ఎన్‌‌జీ దిగుమతిదారు. రిఫైనర్‌‌‌‌ కూడా. మనది నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్‌‌ మార్కెట్‌‌’ అని మోదీ వివరించారు. 2045 నాటికి దేశంలో ఫ్యూయల్‌‌ డిమాండ్‌‌ డబుల్ అవుతుందని అంచనా వేశారు. 

వేగంగా వృద్ధి చెందుతున్న దేశానికి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో దేశ జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందిందని, గ్లోబల్‌‌ జీడీపీ గ్రోత్ రేట్ కంటే  మనది ఎక్కువగా ఉందని మోదీ అన్నారు. ఫ్యూచర్‌‌‌‌లో కూడా ఇలాంటి ట్రెండే ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌ (ఐఎంఎఫ్‌‌) అంచనా వేసిందని చెప్పారు.  త్వరలో  మూడో అతిపెద్ద ఎకానమీగా మారుతామని ఆర్థిక నిపుణులందరూ అంచనా వేస్తున్నారని,  ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న  ఎనర్జీ మార్కెట్‌‌లో ఇన్వెస్ట్ చేయాలని గ్లోబల్ ఇన్వెస్టర్లకు పిలుపిచ్చారు.   అందరం కలిస్తేనే   పర్యావరణానికి హాని చేయని రీతిలో  భవిష్యత్‌‌ను క్రియేట్ చేసుకోగలుగుతామని అన్నారు.

గ్లోబల్‌‌ ఆయిల్‌‌ అండ్ గ్యాస్ కంపెనీల సీఈఓలతో నరేంద్ర మోదీ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశానికి సంబంధించి వివరాలు బయటకు రాలేదు.  పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్‌‌ను చేరుకోవడానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి మోదీ వివరించారు. ఫ్యూయల్‌‌ అందుబాటు ధరల్లో ఉండేలా చూస్తున్నామని చెప్పారు.  గ్లోబల్‌‌గా సమస్యలెన్ని ఉన్నా  పెట్రోల్‌‌ ధరలు తగ్గించిన కొన్ని దేశాల్లో ఇండియా కూడా ఉందని, గత రెండేళ్లలో అనేక కుటుంబాలకు ఎలక్ట్రిసిటీ అందించి  100 శాతం కవరేజ్‌‌ పూర్తి చేశామని మోదీ వివరించారు.

ఎనర్జీ డిమాండ్‌‌ను సాంప్రదాయ ఇంధనాలు (పెట్రోల్‌‌, డీజిల్‌‌, బొగ్గు వంటివి),   రెన్యూవబుల్ సోర్స్‌‌ల (సోలార్, విండ్‌‌, హైడ్రోకార్బన్స్‌‌ వంటివి) ద్వారా చేరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం  రూ.11.11 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని 2024–25 ఇంటెరిమ్‌‌ బడ్జెట్‌‌ వెల్లడించింది. ఇందులో మెజార్టీ వాటా ఎనర్జీ సెక్టార్‌‌‌‌లోకి వెళుతుందని మోదీ అన్నారు. ‘ఈ పెట్టుబడులతో  రైల్వే, రోడ్‌‌వేస్‌‌, వాటర్ వేస్‌‌, ఎయిర్‌‌‌‌వేస్‌‌, హౌసింగ్ సెక్టార్‌‌‌‌లో అనేక అసెట్స్ క్రియేట్ అవుతాయి. వీటికి  ఎనర్జీ అవసరం అవుతుంది’ అని అన్నారు.

బయోఫ్యూయల్స్‌‌ మార్కెట్‌‌లో బోలెడు అవకాశాలు..

పెట్రోల్‌‌లో ఇథనాల్ బ్లెండింగ్‌‌ను 20 శాతానికి పెంచామని మోదీ పేర్కొన్నారు. 2014 లో ఇది కేవలం 1.5 శాతం మాత్రంగా ఉందని అన్నారు. బయోఫ్యూయల్స్‌‌ వాడకంపై 22 దేశాలు, 12 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లతో భాగస్వామ్యం అయ్యామని, 500 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక అవకాశాలు క్రియేట్ అవుతాయని చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్‌‌తో 4.2 కోట్ల టన్నుల  కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని మోదీ అన్నారు. దేశంలోని 9 వేలకు పైగా పెట్రోల్ బంకులు ఈ20 పెట్రోల్‌ను అమ్ముతున్నాయని అన్నారు.  

చెరుకు లేదా ధాన్యం నుంచి ఉత్పత్తి చేసిన ఇథనాల్‌‌ను ఈ20 ప్రొడక్షన్‌‌లో వాడుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ, మున్సిపల్ వేస్ట్ నుంచి కంప్రెస్డ్‌‌ బయోగ్యాస్‌‌ను ఉత్పత్తి చేసేందుకు   ప్రభుత్వం 5 వేల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని  చూస్తోంది. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది ఇండియాలో ఉంటున్నా, దేశ కార్బన్ ఎమిషన్స్ వాటా  కేవలం 4 శాతం మాత్రమే ఉందని మోదీ అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్‌‌స్టాల్డ్ కెపాసిటీలో గ్లోబల్‌‌గా నాల్గో ప్లేస్‌‌లో ఉన్నామని అన్నారు. గత పదేళ్లలో సోలార్ ఇన్‌‌స్టాల్డ్‌‌ కెపాసిటీ 20 రెట్లు పెరిగిందని చెప్పారు. హైడ్రోజన్ ప్రొడక్షన్‌‌ను, ఎగుమతులను  పెంచడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌‌ను తెచ్చామని అన్నారు.

ALSO READ : తెలంగాణకు బూతు నేర్పిందే కేసీఆర్ : రఘు