- మూడు సెషన్లలో పాల్గొననున్న ప్రధాని
- వివిధ దేశాల అధినేతలతో భేటీలు.. ఐబీఎస్ఏ సమిట్ కూ హాజరు
జోహన్నెస్ బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికా చేరుకున్నారు. జోహన్నెస్బర్గ్లో శని, ఆదివారాల్లో (ఈ నెల 22, 23) జరిగే జీ20 దేశాల సమిట్లో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా నగరాల మధ్య ఉన్న వాటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ల్యాండ్ అయిన మోదీకి సౌత్ ఆఫ్రికా మంత్రి ఖంబుజో చువేనీ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అక్కడి కళాకారులు పాటలు, నృత్యాలతో ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. అనంతరం జోహన్నెస్బర్గ్లోని ఓ హోటల్ కు మోదీ చేరుకున్నారు. అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నారు. ‘‘జీ20 సమిట్ కోసం జోహన్నెస్బర్గ్ వచ్చాను. కీలకమైన ప్రపంచ అంశాలపై వివిధ దేశాల అధినేతలతో చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు.
జీ20 సమిట్లో మోదీ 3 సెషన్లలో పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే జీ20 సమిట్ సందర్భంగా 6వ ఐబీఎస్ఏ(ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా) సమిట్లోనూ ఆయన పాల్గొననున్నారు. కాగా, జీ20 సమిట్కు 2023లో ఇండియా, 2024లో బ్రెజిల్ అధ్యక్షత వహించగా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెన్సీ బాధ్యతలు తీసుకుంది.
