మే ఫస్ట్ వీక్​లో రాష్ట్రంలో మోదీ పర్యటన!

మే ఫస్ట్ వీక్​లో రాష్ట్రంలో మోదీ పర్యటన!
  • మూడు రోజుల పాటు పాల్గొనే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం కోసం మే నెల మొదటి వారంలో ఆయన షెడ్యూల్  ఖరారు చేసినట్లు తెలిసింది. మే 5, 6, 7వ తేదీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల్లో మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ఈనెల 4న ఆదిలాబాద్​లో, 5న సంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 

15న మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించగా16న నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్  రావడంతో మరోసారి మోదీ పర్యటనకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మే 13న పోలింగ్  నేపథ్యంలో ఆ తేదీకి సరిగ్గా వారం, పదిరోజుల ముందు ప్రధాని పర్యటన ఉండేలా షెడ్యూల్  రెడీ చేస్తున్నట్లు తెలిసింది. మోదీతో పాటు ఇతర ముఖ్య నేతల పర్యటనల షెడ్యూల్​నూ బీజేపీ నేతలు ఖరారు చేసే పనిలో పడ్డారు.