టెస్టు ఫార్మాట్‌ కు ఆమిర్ గుడ్‌ బై

టెస్టు ఫార్మాట్‌ కు ఆమిర్ గుడ్‌ బై

వరల్డ్ కప్-2019లో ఆకట్టుకున్న పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌ కు గుడ్‌ బై చెప్పేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో మాత్రమే కొనసాగాలనుకుంటున్న ఆమిర్‌..  టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు శుక్రవారం అనౌన్స్ చేశాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ జరుగనున్న క్రమంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే.. టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు ఆమిర్‌. ‘ పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్‌ క్రికెట్‌ కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌ గా తీసుకుంటున్నా. వైట్‌ బాల్‌ క్రికెట్‌ పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్‌ తెలిపాడు.

ఆమిర్‌ 17 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా ఈ ఫార్మాట్‌ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్‌ 119 వికెట్లు సాధించాడు.  నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్‌.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్.. 2016లో పునరాగమనం చేశాడు.  అయితే ఆమిర్‌ జాతీయ జట్టులోకి పునరాగమనం తర్వాత మరింత రాటుదేలాడు. 2016 నుంచి ఇప్పటివరకూ 22 టెస్టులు ఆడిన ఆమిర్‌ 68 టెస్టు వికెట్లు సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో.. 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసి ఔరా అనిపించాడు ఆమిర్.