పోస్టాఫీసుకు వెళ్లకుండానే డబ్బు తీసుకోవచ్చు

పోస్టాఫీసుకు వెళ్లకుండానే డబ్బు తీసుకోవచ్చు
  • సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ సదుపాయం 

బిజినెస్ డెస్క్, వెలుగు:  ఇండియా పోస్ట్ అందించే  సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) చాలా పాపులర్. ఎక్కువ మంది సీనియర్​ సిటిజన్లు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే పోస్టాఫీసుకు వెళ్లలేని పెద్దవారికి ఉపశమనం అందించడానికి ఇండియా పోస్ట్ ఒక సదుపాయం తీసుకొచ్చింది. వాళ్లు బ్రాంచ్‌‌కు వెళ్లకుండానే తమ  ఖాతాల నుండి కొంత విత్‌‌డ్రా చేసుకోవచ్చు.  సీనియర్ సిటిజన్లు తమ తరపున డబ్బు తీసుకోవడానికి ఒక మనిషికి అనుమతి ఇచ్చి (ఆథరైజ్డ్ పర్సన్‌‌) ఏదైనా శాఖకు పంపవచ్చు. ఓల్డేజ్ పెన్షనర్లు విత్‌‌డ్రాయల్ కోసం, లోన్ కోసం లేదా అకౌంట్లను మూసివేయడం కోసం వీరిని పంపొచ్చని ఇండియా పోస్టు తెలిపింది.
పీపీఎఫ్ డబ్బు తీసుకోవడానికి ఆథరైజ్డ్ పర్సన్‌‌ను పంపడం ఇలా.. 
ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్ శాఖ నుండి పీపీఎఫ్ లేదా ఎస్సీఎస్ఎస్ నిధులను అకౌంట్ హోల్డర్ తరఫున తీసుకునేలా ఒక వ్యక్తికి అధికారం ఇవ్వడానికి సీనియర్ సిటిజన్లు ఈ పద్ధతులను పాటించాలి. 
1. సరిగ్గా నింపిన ఫారమ్ ఎస్‌‌బీ-12 పై సంతకం చేయాలి. చదువుకున్న సీనియర్ సిటిజన్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి విషయంలో,  సిబ్బందికి అధికారం ఇవ్వడానికి ఈ ఫారమ్‌‌పై సంతకం చేయవచ్చు.
2. ఖాతా మూసివేత లేదా కొంత మొత్తం విత్‌‌డ్రాయల్‌‌ కోసం ఎస్బీ-7 ఫారం లేదా ఎస్బీ-7బీ ఫారంపై సంతకం చేయాలి. ఆథరైజ్డ్ పర్సన్ సెల్ప్‌‌ సర్టిఫికేషన్ కాపీని,  ఖాతా హోల్డర్ అడ్రస్‌‌ ప్రూఫ్‌‌ కాపీని కూడా అందజేయాలి.
3. నిధులను ఉపసంహరించుకోవడానికి సీనియర్ సిటిజన్ పాస్ బుక్ ఇవ్వాలి. లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి ముందు ఖాతాదారుల సంతకాలను పోస్టాఫీసులోని ఆఫీసర్లు సరిపోలుస్తారు.