వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిలో బ్లాకేడ్ (దిగ్భంధనం) నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా సరే సహించబోమని అమెరికా తేల్చిచెప్పింది. హార్మూజ్లో శాంతిభద్రతలు కాపాడేందుకు అమెరికా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో అన్ని దేశాలు తమ ఆదేశాలను పాటించాలని సూచించింది. అమెరికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడాన్ని, ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసింది. కాగా, హార్మూజ్ జలసంధిలో భారత నావికులతో వెళ్తున్న నౌకలపై యూఎస్ దళాలు దాడులు చేయడంపై ఇండియా అభ్యంతరం తెలపడంపై అమెరికా ఈ విధంగా రియాక్ట్ అయ్యింది.
ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో హార్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్భంధనం విధించిన విషయం తెలిసిందే. దిగ్భంధనం నిబంధనలు ఉల్లంఘించిన, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసిన ఆయా నౌకలపై అమెరికా దాడులతో చేస్తోంది. ఈ క్రమంలోనే 2026,జూన్ 8న 24 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న పలావు జెండా గల మారివెక్స్ అనే చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇదిలా ఉండగానే.. 2026, జూన్ 10న భారతీయ నావికులతో MT సెట్టెబెల్లో అనే మరో నౌకపై అమెరికా దాడి చేసింది.
ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ ఘటనపై ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఘటనపై అమెరికా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మార్కో రూబియోతో శుక్రవారం (జూన్ 12)న ఫోన్లో మాట్లాడారు. గల్ఫ్లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావని రుబియోతో అన్నారు జైశంకర్.
►ALSO READ | రష్యా చమురు కొనుగోళ్లపై నీతులు వద్దు..పశ్చిమ దేశాల నోరు మూయించిన భారత విదేశాంగ మంత్రి జై శంకర్
హార్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు సంబంధించి మార్కో రుబియోతో భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడిన విషయాన్ని శనివారం (జూన్ 13) అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. ‘‘విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం (జూన్ 12) భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్తో మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఇద్దరు అధికారులు చర్చించారు.
జలసంధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు అమెరికా దళాలు ప్రయత్నిస్తున్నందున.. అన్ని వాణిజ్య నౌకలు వారి ఆదేశాలను తక్షణమే పాటించాలని ఇండియాకు రూబియో నొక్కి చెప్పారు. అమెరికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడాన్ని, ఇరాన్ చమురును అక్రమంగా రవాణా చేయడాన్ని సహించబోమని ఆయన స్పష్టం చేశారు’’ అని అమెరికా తమ వైఖరిని స్పష్టం చేసింది.
