ఐటీ రంగంలోనే జీతాలు ఎక్కువగా పెరుగుతాయనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ, దానికి భిన్నంగా తయారీ, ఇంజనీరింగ్ (MEI) రంగంలో పనిచేసేవారికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో అదిరిపోయే జీతాల పెంపు లభించనుంది. 'టీమ్లీజ్ జాబ్స్ అండ్ శాలరీస్ ప్రైమర్ FY2026–27' రిపోర్ట్ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం:
1. జీతాల పెంపులో ఐటీని కొట్టేసిన ఇంజనీరింగ్
గత ఏడాది 7.9% ఉన్న జీతాల పెంపు, FY27 నాటికి 9.4%కి పెరుగుతుందని అంచనా వేశారు. అంటే ఇంజనీరింగ్ రంగంలో జీతాల వృద్ధి 9.9%గా ఉండనుంది. ఇదే సమయంలో ఐటీ రంగం 9.8%తో రెండో స్థానంలో, ఫైనాన్స్ రంగం 9.5%తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశంలో సెమీకండక్టర్ల తయారీ విస్తరణ, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడం వల్ల ఈ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది.
2. ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతాల పెంపు అంటే
అనుకున్నట్లుగా సాధారణ ఉద్యోగాలకు కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండ్లో నడిపించే టెక్నికల్ నిపుణులకే భారీ హైక్స్ రానున్నాయి. వీరిలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఏకంగా 10.7% పెంపుతో అగ్రస్థానంలో ఉన్నారు. EHS (పర్యావరణం, ఆరోగ్యం, భద్రత) అధికారులు & సైట్ ఇంజనీర్లు 10.1% పెంపును పొందనున్నారు. మెకానికల్ డిజైన్ ఇంజనీర్లు 9.9% జీతాల పెరుగుదలను అందుకోనున్నారు.
3. ఏయే నగరాల్లో జీతాలు ఎక్కువ అంటే
ఈ రంగంలో నగరాల వారీగా చూస్తే కొన్ని ప్రాంతాలు దూసుకుపోతున్నాయి. గుర్గావ్ 10.9% తో మొదటి స్థానంలో ఉండగా.. కోయంబత్తూర్ 10.8% తో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ & పూణే, ఈ రెండు నగరాల్లో 10.1% చొప్పున జీతాలు పెరిగే అవకాశం ఉంది. వడోదర కూడా 9.9% వృద్ధిని నమోదు చేయనుంది.
ALSO READ : సాధారణ పెట్రోల్కు, ప్రీమియం పెట్రోల్కు అసలు తేడా ఏంటో తెలుసా?
మొత్తంగా చెప్పాలంటే ఫ్యాక్టరీలలో లేదా ప్రాజెక్ట్ సైట్లలో ఉండి పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగల నిపుణులకు ఇప్పుడు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. కేవలం డిజిటల్ టెక్నాలజీ మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో పనిని నడిపించగల ప్రత్యేక స్కిల్స్ ఉన్నవారికే భవిష్యత్తులో మంచి రోజులు ఉంటాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
