దేశవ్యాప్తంగా జరిగిన జెన్-జెడ్ నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. నిరసనల సమయంలో వాడిన భాషపై మండిపడిన కంగనా.. యువత పెంపకాన్ని, వారి ప్రవర్తనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమెపై లేటెస్ట్ గా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్రస్థాయిలో మండిపడింది.
ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ను ఆమె సొంత పార్టీ నాయకులే ఎవరూ సీరియస్గా తీసుకోరని, అలాంటప్పుడు తాము ఎందుకు పట్టించుకోవాలని సెటైర్ వేశారు. దేశానికి ఎంపీగా కంగనా చేసిన సేవకంటే.. జెన్ జెడ్ జనరేషన్ చేసిందే ఎక్కువని విమర్శించింది. ఎంపీ పదవికి పెద్దగా పని ఉండదని తాను భావించానని కంగనానే స్వయంగా చెప్పిన వీడియోలను గుర్తుచేస్తూ.. ఆమెలోని నిబద్ధత లోపాన్ని సౌరవ్ దాస్ ఎత్తిచూపారు.
కంగనా ఏమన్నారంటే.?
నీట్ పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్వద్ద నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు 'వాంతులు తెప్పించేలా' ఉన్నాయని, ఆందోళనకారులు తమలోని మురికిని, చెత్తను సమాజం ముందు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నిరసనకారుల తీరు, వాడుతున్న భాష అత్యంత అసభ్యంగా ఉందని మండిపడ్డారు. మిమ్మల్ని మీరే బొద్దింకలని పిలుచుకుంటూ, అలాగే ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వీడియోలు చూసి తాను మనోవేదనకు గురయ్యానని, డిజిటల్ డిటాక్స్ కావాలని అన్నారు.
►ALSO READ | రేపిస్టులను సమర్థించే వ్యక్తిని.. విద్యాశాఖ మంత్రిని చేయడమేంటీ: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
