
జగిత్యాల జిల్లా: భార్య ఆత్మహత్య చేసుకున్న 15 రోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఎర్దండి గ్రామంలో విషాదం నింపింది. "దసరా రోజు తన ఇంట్లో నాన్ వెజ్ తినకుండా తల్లిగారి ఇంటికాడ ఎందుకు తింటున్నావ్" అని ప్రశ్నించడంతో అదే రోజు రాత్రి సంతోష్ భార్య గంగోత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. గంగోత్రి చనిపోవడానికి వారం ముందే వీరిద్దరి ప్రేమ వివాహం జరిగింది.
ఆదిలాబాద్లోని సోదరి ఇంట్లో ఉరివేసుకొని గత రాత్రి సంతోష్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భార్య చనిపోవడంతో సంతోష్ మానసికంగా కుంగిపోయాడు. దీంతో.. ఆ డిప్రెషన్ నుంచి బయటపడతాడని ఆదిలాబాద్లోని తన అక్క దగ్గరకు కుటుంబ సభ్యులు సంతోష్ను పంపించారు. అయినప్పటికీ సంతోష్ మనసును భార్య చావు తొలిచివేసింది. అక్కడే ఉరివేసుకొని సంతోష్ చనిపోయాడు.
గంగోత్రి ఎలా చనిపోయిందంటే..
చికెన్ భోజనం విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగి మనస్తాపంతో గంగోత్రి అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన వారం రోజుల్లోనే ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు అలియాస్ అల్లెపు గంగోత్రి(22), అదే గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్ ఆరేండ్లుగా ప్రేమించుకున్నారు.
ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 26న పెండ్లి చేసుకున్నారు. కాగా, గురువారం దసరా రోజు భర్తతో కలిసి గంగోత్రి పుట్టింటికి వెళ్లింది. అదే రోజు కుటుంబ సభ్యులతో కలిసి గంగోత్రి చికెన్ తింటుండగా, భర్త సంతోష్ ప్రశ్నించాడు. ఇంటికి మటన్ తీసుకువస్తే ఎప్పుడూ తినని నువ్వు ఇప్పుడూ ఎలా తింటున్నావని అడిగాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగింది. అదే రోజు భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని చనిపోయింది.