నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరం.. పాపం.. ఈ పిల్లలు ఏం చేశారని.. నీ కన్న బిడ్డలే కదయ్యా..!

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరం.. పాపం.. ఈ పిల్లలు ఏం చేశారని.. నీ కన్న బిడ్డలే కదయ్యా..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గుప్త వెంకటేశ్వర్లు(35) డెడ్ బాడీ లభ్యమైంది. ఆత్మహత్యకు ముందు అతను తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించేసి చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. పూర్తిగా దహనమైన స్థితిలో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

ఆగస్ట్ 31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో వెంకటేశ్వర్లు తన చిన్న కూతురు వర్షిణి, కొడుకు శివధర్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కూతురు మోక్షితను కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. పిల్లలు ముగ్గురిని చంపేశాక కల్వకుర్తి టౌన్కు వెళ్లాడు. పురుగుల మందు కొనుక్కుని తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

వెల్దండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం భార్య దీపికతో గొడవపడి ముగ్గురు పిల్లలు మోక్షిత(8), వర్షిణి(6), శివ ధర్మ(4)తో కలిసి వెంకటేశ్వర్లు బైకుపై డిండి ప్రాజెక్టుకు వెళ్లాడు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా మూడు రోజులు డిండి, హాజీపూర్  గ్రామాల్లో తిరుగుతూ గడిపాడు. ఆ తరువాత వర్షిణి, శివధర్మను హాజీపూర్ పెట్రోల్ బంక్ దగ్గర వదిలి, పెద్ద కూతురు మోక్షితతో కలిసి వెల్దండ వైపు వెళ్లాడు.

వెల్దండ మండలంలోని పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు బుధవారం అనుమానాస్పదంగా చనిపోయి కనిపించాడు. వెంకటేశ్వర్లు డెడ్ బాడీ గురించి అతని భార్య దీపికకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆమె నాలుగు రోజుల కింద భర్త, ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దీపిక ఫిర్యాదు మేరకు వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం ఈ కేసులో పిల్లల ఆచూకీ కూడా లభ్యమైంది.