
- కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్లో దూకిన తల్లీకొడుకు
- సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన వారిగా గుర్తింపు
కామారెడ్డి, వెలుగు : భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మునిగేపల్లికి చెందిన దార ప్రమీల (29) భర్త సాయిలు అప్పుల బాధతో 20 రోజుల కింద ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ప్రమీల తన కొడుకు అక్షయ్ (7)తో కలిసి బ్యాంక్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చింది.
రాత్రి అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం ఆరేపల్లి శివారులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపలు పడుతున్న వ్యక్తులకు ఇద్దరి డెడ్బాడీలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చనిపోయింది ప్రమీల, అక్షయ్గా గుర్తించి కుటుంబ సభ్యులకు చెప్పారు. మృతురాలి తండ్రి దుర్గయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.