తల్లి సహా ఇద్దరు పిల్లలు గల్లంతు

తల్లి సహా ఇద్దరు పిల్లలు గల్లంతు

జడ్చర్ల టౌన్, వెలుగు: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి సహా ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా, మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మహబూబ్​నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన అద్దాల మైబయ్య, రమాదేవి (35) భార్యాభర్తలు. వీరికి నవ్య, చందన , మారుతి అనే పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల కింద వీరు ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వెళ్లారు. పెద్ద కుమార్తె నవ్య దేవరకద్ర గురుకులంలో చదువుకుంటోంది. ఆదివారం పెద్దల పండుగ కావడంతో ఊరికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పిన రమాదేవి ఇద్దరు పిల్లలను తీసుకొని శనివారం ఉదయం బస్సులో పాలమూరుకు వచ్చింది.

అక్కడి నుంచి దేవరకద్రకు వెళ్లి పెద్ద కూతురును కూడా తీసుకొని ఊరికి బయల్దేరింది. అయితే గ్రామ సమీపంలోనే పిల్లలను తీసుకొని బస్సు దిగింది. అక్కడున్న ఓ చెరువు వద్దకు తీసుకువెళ్లింది. నవ్య నీళ్లలో మునిగిపోతామని చెబుతున్నా రమాదేవి వినిపించుకోకుండా పిల్లలతో కలిసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రమాదేవి, చందన, మారుతి నీళ్లలో మునిగిపోగా.. నవ్య కంప చెట్టును పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులను పిలిచి నవ్యను కాపాడాడు. అయితే మిగతా ముగ్గురు అప్పటికే నీళ్లలో మునిగి గల్లంతయ్యారు.