అత్తింటి వేధింపులతో బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

అత్తింటి వేధింపులతో బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

కాజీపేట, వెలుగు: నాలుగేండ్ల బిడ్డను గొంతునులిమి చంపిన ఓ తల్లి, తర్వాత తానూ  సూసైడ్​ చేసుకుంది. మడికొండ సీఐ వేణు కథనం ప్రకారం..జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్ మండలం చాగల్​ గ్రామానికి చెందిన అనిత(26)కు,  హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన రాకేశ్​తో  ఐదేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి పాప శివశాన్విక(4) ఉంది.   రాకేశ్​ తన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, భార్య, బిడ్డతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు.  పెండ్లి  టైంలో అనితకు కట్నం కింద ఆమె తల్లిదండ్రులు చాగల్​ లో  20 గుంటల వ్యవసాయ భూమిని రాసిచ్చారు.  

ఆ భూమికి  మంచి రేటు పలుకుతుండడంతో  అమ్మితే  కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని రాకేశ్​, అత్తింటివారు భావించాడు. తమ్ముళ్ల పెళ్లిళ్లు  కూడా చేయొచ్చని రాకేశ్​ అనుకున్నాడు. ఈ విషయంలో అనితకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీనిపై గతంలోనూ పంచాయితీలు  జరగ్గా  భూమి అమ్మేందుకు అనిత ఒప్పుకోలేదు. అత్తింటివారు పట్టుబట్టడంతో మనస్తాపం చెందిన అనిత బుధవారం ఇంట్లో బిడ్డ గొంతు నులిమి చంపి,  తానూ ఉరేసుకుంది.