ఆడపడచుతో గొడవ పడి పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న తల్లి

ఆడపడచుతో గొడవ పడి పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న తల్లి

పెద్దపల్లి జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన స్వామి హమాలీ పనిచేస్తూ భార్య విజయ, కుమారుడు శివకృష్ణ (3), కూతురు శ్రీకృతి(2)తో నివసిస్తున్నాడు. స్వామి తండ్రి చనిపోవడంతో తల్లి; భర్త చనిపోవడం స్వామి సోదరి పద్మ కూడా వీరితోపాటే ఉంటున్నారు. అయితే స్వామి భార్య విజయతో అత్త, ఆడపడుచు నిత్యం గొడవ పడేవారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా విజయతో వారిద్దరూ గొడవపడ్డారు. దాంతో విజయ వెంటనే భర్తకు ఫోన్ చేసి గొడవ గురించి చెప్పింది. దానికి స్వామి.. తాను పనిలో ఉన్నానని.. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పాడు. ఆ తర్వాత స్వామి రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి విజయ, పిల్లలు ఇంట్లో లేరు. మరుసటి రోజు ఉదయాన్నే గ్రామంలో వెతుకుతుండగా.. స్థానికంగా ఉన్న బావిలో పిల్లల శవాలు తేలాయి. అదేవిధంగా విజయ చెప్పులు కూడా అదే బావిలో తేలుతూ కనిపించాయి. పిల్లల శవాలను చూసి తీవ్ర రోదనకు గురైన స్వామి.. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పిల్లల శవాలను బయటకు తీసి.. తల్లి విజయ శవం కోసం బావిలో గాలిస్తున్నారు. స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.