ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్కు జ్వరం వస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వరంగల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని మోదీ ని ఉద్దేశించి బండి మాట్లాడుతూ... 'భారతీయ జనతా పార్టీ జెండా మోసిన భుజం అన్నా ఇదీ.. ఒక్కసారి మోదీని దగ్గర నుంచి చూడాలని.. మోదీ నోటి వెంట సంజయ్ అనే పేరు రావాలని కల కన్నాను.. నా కల నెరవేరింది. నాకు రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు అప్పగించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఎన్నటికీ మర్చిపోలేను.' అని బండి అన్నారు.
వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించి వాటితో వందల సంఖ్యల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మోదీ తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. 'జై మోదీ' నినాదంతో కేసీఆర్ చెవుల్లోంచి రక్తం రావాలని చెబుతూ.. సభికులతో పాటు నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీల పాలన బద్దలు కొట్టే రోజులు దగ్గర్లోనే ఉండనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.