లోక్ సభలో ఎంపీ అర్వింద్ ఆవేదన
న్యూఢిల్లీ, వెలుగు: టీఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో 38 మంది కార్మికులు చనిపోయారని, వారి మరణాలకు జిమ్మెదారీ ఎవరని ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్ సభలో ప్రశ్నించారు. సమ్మె కాలంలో సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ లు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని సభకు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొంత మంది ఆవేదన చెంది గుండెపోటుతో మరణించారన్నారు. ఐదు వేల కోట్ల అప్పులు, సంవత్సరానికి వెయ్యి కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని నడపలేమని, ఆర్టీసీ ఒక చరిత్ర అని చెప్పిన కేసీఆర్, ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీని నడిపేందుకు రూ.47 కోట్లు కేటాయించాలని కోర్టు సూచిస్తే, బడ్జెట్ లేదని సమాధానం ఇచ్చారన్నారు. ఇప్పుడు కార్మికులకు విందులు ఇస్తూ, వారి కోసం రూ.100 కోట్ల నిధులు, కార్మికుల పిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్, రిటైర్ మెంట్ వయస్సు పెంపు వంటివి ప్రకటించారని తెలిపారు. ఇదే యూటర్న్ నిర్ణయాన్ని రెండు నెలల ముందే ప్రకటించి ఉంటే, 38 మంది కార్మికులు చనిపోయేవారు కాదన్నారు. ఇంటర్ విద్యార్థుల మార్కుల్లో జరిగిన అవకతవకల కారణంగా కూడా 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.