పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల మాజీ జడ్పీటీసీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మేడిశెట్టి రాములు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో పార్టీలో చేరగా, వారు రాములుకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే విశ్వాసం ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులను కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

