ఇక కేసీఆర్ శకం ముగిసింది : ఎంపీ అర్వింద్

ఇక కేసీఆర్ శకం ముగిసింది : ఎంపీ అర్వింద్

తెలంగాణలో ఏడాది క్రితం వరకు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే భావన ఉండేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వైఫల్యం విషయంలో బీజేపీలో లోటుపాట్లు పరిశీలించి, చర్చ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక కేసీఆర్ శకం ముగిసిందని, అందుకు సగం సంతోషంగా ఉందన్నారు. ఇది బీఆర్ఎస్ పతనానికి ప్రారంభం అని చెప్పారు. తెలంగాణలో హుందాతనంతో కూడిన పరిస్థితులు మళ్లీ వస్తాయని చెప్పారు. దాడుల సంస్కృతికి స్టాప్ పడుతుందని, భాష కూడా మారుతుందని భావిస్తున్నానని చెప్పారు. 

రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చాక కూడా డిపాజిట్ రాని పరిస్థితి ఉండేదని, అక్కడి నుంచి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని, ఈ విషయంలో ఆయన్ను తప్పనిసరిగా అభినందించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న ఆరోపణ నిజమే అని జనం భావించారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఈ పరిస్థితికి దోహదం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ లో నిలబడాల్సిన చోట కోరుట్ల ఎందుకు వెళ్లావని తనను చాలామంది అడిగారని చెప్పారు. బీజేపీకి అభ్యర్థి లేని చోట వెళ్లి తన వంతు కృషి చేశానని,  ఓట్లు పెరిగాయన్నారు. 

నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల తెలంగాణకే ఆదర్శం అన్నారు. తనను అసెంబ్లీ అభ్యర్థిగా చూడడం కూడా ప్రజలకు వింతగా ఉండే అన్నారు. కాంగ్రెస్ బలపడటం వల్ల ఓట్లు చీలి కొన్ని బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. తెలంగాణలో ఇకపై కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. నయా పైసా పంచకుండా తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. బాల్కొండలో ఒక్కరోజులో రూ.34 కోట్లు బీఆర్ఎస్ పంచిందని ఆరోపించారు. 

దేశంలోనే ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న అసెంబ్లీ ఎన్నికలుగా మారాయన్నారు. కోరుట్లలో డబ్బు పంచకుండా తాను ఒక ప్రయోగం చేశానన్నారు. ఓడిపోయినా సరే.. అన్ని ఓట్లు ఇవ్వడం అంటే కోరుట్ల ప్రజల విజయం అని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జారుకుంటారని, ప్రజల్లో అభిమానం పోయిందన్నారు. సహజ మరణం మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుందన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దు అని తాను కోరుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ భాష, తీరు ఏదీ వద్దన్నారు.