భువనగిరి ఖిల్లాకు నిధులివ్వండి

భువనగిరి ఖిల్లాకు నిధులివ్వండి

న్యూఢిల్లీ: భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కిషన్ రెడ్డిని కలసిన వెంకట్ రెడ్డి.. ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. పర్యాటక రంగంలో నూతన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలోని  భువనగిరి ఖిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట అభివృద్ధికి సహకరించడం లేదని కిషన్ రెడ్డికి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేశంలో అనేక చారిత్రక కట్టడాలు కాలగమనంలో  కలసి పోయాయని ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. పట్టించుకోకుంటే భువనగిరి కోట పరిస్థితి అలాగే మారే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి.. వెంటనే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.