ఈసారి కాంగ్రెస్​ రాకపోతే బానిస బతుకే..

ఈసారి కాంగ్రెస్​ రాకపోతే బానిస బతుకే..
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల చేతులు నరకాలి  : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నకిరేకల్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే రాష్ట్ర ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేయకుండా  మరో పార్టీలో చేరిన నాయకుల రెండు చేతులు నరకాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మీ అందరికి తెలుసని పరోక్షంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్​ పార్టీలో టికెట్​ను పక్క రాష్ట్రం నుంచి వచ్చిన పీకే ఇచ్చే దుస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణను నిజంగా అభివృద్ధి చేసి ఉంటే పీకేతో పనేంటని ప్రశ్నించారు. ఈ ఏడాది డిసెంబర్​లో ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని, అందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు దిక్కు లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్​ అంటే రైతుల పార్టీ అని, అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్,​ కేతేపల్లి ఎంపీపీ శేఖర్, డీసీసీ ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట్​రెడ్డి, జడ్పీటీసీ స్వర్ణలత, పన్నాల రాఘవరెడ్డి, గార్లపాటి రవీందర్​రెడ్డి, కౌన్సిలర్లు గాజుల సుకన్య,  దైద స్వప్న , తదితరులు పాల్గొన్నారు.