
= నేను భూమి అమ్మిన వ్యక్తి నుంచి రూ. 13 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్
= నా ఫ్రెండ్ బంగారం కొంటే అవి నా డబ్బులని దౌర్జన్యం
= ఫిర్యాదు చేసిన నాపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండ్రు
= గత ప్రభుత్వంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన భార్య సంగీతారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం (జూన్ 27) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సిట్ కు స్టేట్ మెంట్ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ జరిగినట్టు సిట్ అధికారులు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ మొదలైందని అన్నారు. అభద్రతా భావంతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని వివరించారు. తన ఆఫీసుపై పోలీసులు వచ్చి దౌర్జన్యం చేశారని, ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని అన్నారు.
ఎన్నికల సమయంలో తనతోపాటు తన అనుచరుల మూవ్ మెంట్ పైనా నిఘా వేశారని చెప్పారు. తన స్నేహితుడు రూ. 72 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేశారని, అవి తన డబ్బులు అని ఇబ్బంది పెట్టారని చెప్పారు. తాను ఓ వ్యక్తికి భూమి అమ్మితే ఆయన డబ్బులు ఇచ్చారని, ఆ వ్యక్తిని వేధింపులకుగురి చేసి రూ. 13 కోట్లకు ఎలక్ట్రోరల్ బ్యాండ్స్ తీసుకున్నారని అన్నారు.
ఈటలకు తాను డబ్బులు ఇవ్వకున్నా ఇచ్చినట్టు నిందలు మోపారని అన్నారు. తన కాల్స్ రికార్డు చేయడం కాదని, లైవ్ లోనే ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసిన తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని అన్నారు. ఎస్వోటీ చీఫ్ ప్రభాకర్ రావుతోపాటు ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినోళ్లందరినీ శిక్షించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు.