
హైదరాబాద్, వెలుగు : ‘‘రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? సొంత సామాజిక వర్గానికి కేబినెట్లో నాలుగు మంత్రి పదవులు ఇచ్చుకున్నడు. మిగిలిన వర్గాలకు అన్యాయం చేసిండు”అని సీఎం కేసీఆర్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మనువడిని కూడా మంత్రిని చేస్తారని ఎద్దేవా చేశారు. పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కుతున్నాయని ఆరోపించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్లో లక్ష్మణ్ పాల్గొన్నారు. తర్వాత గచ్చిబౌలిలోని ఓ హోటల్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నరు.
రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండి, రైతు కాకపోయినా రైతు బంధు ఇవ్వడం సరికాదు. తెలంగాణలో కొత్త పరిశ్రమలు కాదు కదా.. ఉన్నవాటిని మూసి వేయిస్తున్నరు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి”అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేసి ఉంటే.. ఎందరో పేదలకు మేలు జరిగి ఉండేదన్నారు. రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి, ఇప్పటి దాకా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.