పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్
  • ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌ వద్ద బీసీ సంఘాల నిరసన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత పార్లమెంట్‌‌ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. బుధవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ నేత వీహెచ్, ఇతర నేతలు ఈ నిరసనకు సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్ర కులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి.. ఆ వర్గానికి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం కల్పించిందని గుర్తుచేశారు. కానీ దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, -పందులు, పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని శాశ్వత బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేదని వ్యాఖ్యానించారు. బీసీల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వెనకబడిన వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీంలు రూపొందించాలని కోరారు.