- హైకోర్టు తీర్పుపై ఫుల్ బెంచ్ కు అప్పీల్ చేయాలి
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని కాలేజీలకు గట్టి ఆదేశాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బెంచ్కు అప్పీల్ చేయాలని కోరారు. కొత్తగా జారీ చేసిన జీవో నంబర్ 7ను ఉపసంహరించుకోవడంతో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆర్ కృష్ణయ్య సీఎంకు లేఖ రాశారు. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు రావడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వేధిస్తున్నాయని తెలిపారు.
ఓ కాలేజీ యాజమాన్యం ఒత్తిడితో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేస్తే కాలేజీలు అడ్మిషన్ ఇవ్వడానికి ఎలా అంగీకరిస్తాయని ప్రశ్నించారు.
