జిన్నారం, వెలుగు: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లిలో ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. గ్రామానికి తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రింగ్రోడ్డు సమీపం నుంచి వెళ్తున్న మంజీరా నీటి నుంచి గ్రామానికి నీరు అందించవచ్చని అధికారులు చెప్పడంతో పైప్ లైన్లను పరిశీలించారు. సాధ్యమైనంత తొందరగా కాజిపల్లికి తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పలువురు నాయకులు గండి చెరువు అలుగు ఎత్తు పెంచడం వల్ల బ్యాక్ వాటర్ కాజిపల్లిలోని ఇళ్లలోకి వచ్చి చేరుతోందని చెప్పడంతో గండి చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం అలుగు ఎత్తు తొలగించి గతంలో ఉన్న అలుగు ఎత్తు ఉంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫోన్లో అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో గ్రామంలోని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, నాయకులు ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్యనారాయణ, నవీన్, మాజీ ఎంపీటీసీ భార్గవ్, బీజేపీ నాయకులు నర్సింగరావు, అశోక్ పాల్గొన్నారు.
