హైదరాబాద్: కంది రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కంది రైతులు రోడ్కెక్కే పరిస్థితులు వచ్చాయని, అలాంటప్పుడు రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కంది విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చేతగాని తనంతో కేంద్రానికి తప్పుడు లెక్కలు ఇచ్చారని, ప్రైవేటు వ్యాపారుల సూచనల మేరకే ప్రభుత్వం రైతుల వద్ద కందులు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణం పరిస్థితిని సమీక్షించాలని, సివిల్ సప్లై ద్వారా రైతు వద్ద ఉన్న చివరి గింజ వరకు కందులు కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రంప్ విందుకు హాజరై… ఇవాంక యోగక్షేమాలు తెలుసుకోవడం కాదని, రాష్ట్రంలోని కంది రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని రేవంత్ అన్నారు. రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించకపోతే ‘రైతు గోస’ పేరుతో తమ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.