- ప్రలోభాలతో ఇన్విజిలేటర్లయిన ప్రభుత్వ టీచర్లకు ఎర
- టెన్త్ ఎగ్జామ్ ప్రారంభమైన కాపేపటికే వాట్సాప్లో ప్రత్యక్షమైన క్వశ్చన్ పేపర్స్
- లీక్ ఘటనపై కలెక్టర్ సీరియస్.. ఏడుగురు టీచర్ల సస్పెన్షన్
నిజామాబాద్, వెలుగు: విద్యను దందా చేసుకున్న కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు టెన్త్లో ర్యాంకులు తెచ్చుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నాయి. పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యులైన ప్రభుత్వ టీచర్లకు నజరానాలు ఆఫర్ చేసి బుట్టలో వేసుకుంటున్నాయి. ప్రలోభాలకు కక్కుర్తిపడ్డ టీచర్లు గౌరవప్రదమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
బుధవారం నిజామాబాద్ జిల్లాలోని మూడు ఎగ్జామ్సెంటర్ల నుంచి పరీక్షలు జరుగుతున్న టైమ్లోనే క్వశ్చన్ పేపర్స్ వాట్సాప్లో బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఉదంతాన్ని సీరియస్గా పరిగణించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 9 మంది గవర్నమెంట్ టీచర్లను తక్షణమే సస్పెండ్ చేశారు. తర్వాత వీరిలో ఇద్దరి పాత్ర లేదని తెలిసి సస్పెన్షన్ ఎత్తివేశారు. క్వశ్చన్ పేపర్స్ లీక్ కావడానికి గల కారణాలను ఇంటెలిజన్స్ లోతుగా విచారిస్తోంది.
ఎగ్జామ్ డ్యూటీలకు పోటీ
జిల్లాలో గవర్నమెంట్ ప్రైమరీ, హైస్కూల్స్ 1,156, ప్రైవేట్స్కూల్స్465 ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 24,399 మంది స్టూడెంట్స్ టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. గతంలో ఆయా సబ్జెక్టుల్లో ఫెయిలైన సుమారు 100 మంది ప్రైవేట్గా పరీక్షలు రాస్తున్నారు. వీరందరి కోసం జిల్లాలో 144 ఎగ్జామ్సెంటర్లను ఏర్పాటు చేసి అదే సంఖ్యలో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, సిట్టింగ్ స్వ్యాడ్ను నియమించారు.
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, స్కూల్అసిస్టెంట్హోదాలోని వీరు పరీక్షల నిర్వహణను ఎక్కడికక్కడ పర్యవేక్షించాలి. ఇన్విజిలేటర్లుగా అపాయింటైన 1,214 ఎస్జీటీల్లో సగం మంది రూముల్లో జరిగే ఎగ్జామ్స్ను డైరెక్ట్గా అజమాయిషీ చేయాల్సి ఉండగా.. మిగతా సగం క్లర్క్విధుల్లో ఉంటారు.
పరీక్షలు మొదలయ్యే నెల రోజుల ముందే ఈ నియామకాలు జరుగుతుండగా కొన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఇందులో కీరోల్ పోషిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉండే వారిని ఏరికోరి ఎగ్జామ్ డ్యూటీలు వేయించుకొని సెంటర్వారీగా రూ.2 లక్షలు ముట్టజెబుతున్నట్లు సమాచారం.
ఇలా తమ స్టూడెంట్స్కు ఎన్ని సెంటర్లు పడితే అన్నింటికీ ముడుపులు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో టెన్త్ఎగ్జామ్ డ్యూటీలకు పోటీ పెరిగింది. రెండేండ్ల క్రితం బోధన్లో పది పరీక్ష డ్యూటీలు వేయలేదని కొందరు టీచర్లు కొట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. అడ్డదారిలో ర్యాంకులు సాధించి భారీ ఫీజులతో స్కూల్అడ్మిషన్లు పెంచుకోడానికి చాలా వరకు ప్రైవేట్స్కూల్స్ఈ విధానాన్ని పాటిస్తున్నాయి.
క్వశ్చన్ పేపర్స్ ఫొటోలు వారి కోసమే..
ఈ నెల 14న టెన్త్పరీక్షలు ప్రారంభం కాగా బుధవారం సెకండ్ లాంగ్వేజ్ఎగ్జామ్జరిగింది. పరీక్ష ప్రారంభం కాగానే నిజామాబాద్ జిల్లాలోని మూడు సెంటర్ల నుంచి తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్స్బయటకు రావడం కలకలం రేపింది.
ఉదయం 9.30 గంటలకు షురూ కాగా ఆలూర్ జడ్పీ హైస్కూల్సెంటర్ నుంచి వాట్సాప్లో బయటకు వచ్చిన తెలుగు ప్రశ్నాపత్రం నిజామాబాద్లోని 4 ప్రముఖ ప్రైవేట్స్కూళ్ల స్టూడెంట్ల ప్రయోజనం కోసం పంపినట్లు తెలుస్తోంది. మెండోరా జడ్పీ స్కూల్నుంచి బయటకు వచ్చిన హిందీ పేపర్ఆర్మూర్, బాల్కొండలోని ప్రైవేట్ మేనేజ్మెంట్స్కోసమని ప్రాథమికంగా తేలింది.
బోధన్లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సెంటర్ నుంచి వచ్చిన తెలుగు క్వశ్చన్పేపర్వెనుక అక్కడి టౌన్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ల ప్రమేయం ఉందని గుర్తించారు. 3 సెంటర్ల నుంచి బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించి విద్యాశాఖ ఆఫీసర్స్కు చెప్పేదాకా వారికి తెలియకపోవడం గమనార్హం. ఘటనను సీరియస్గా పరిగణించిన కలెక్టర్ బాధ్యులైన టీచర్లను సస్పెండ్ చేశారు. ఇంకా జరగాల్సిఉన్న 5 సబ్జెక్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పేపర్స్ లీక్పై ఇంటెలిజన్స్పోలీసులు డిటైల్డ్ ఎంక్వైరీ చేపట్టారు.
