సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతున్న డీప్ఫేక్లు, తప్పుదోవ పట్టించే పోస్టులు, ఫేక్ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ప్లాట్ఫారమ్లలో చట్టవిరుద్ధమైన, తప్పుదోవ పట్టించే కంటెంట్ను అరికట్టడానికి వెంటనే అల్గారిథమ్లను మార్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
కేంద్రం నుంచి మెటాకు అందిన ఆదేశాలు ఇవే:
*డీప్ఫేక్లు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుడు ప్రచారాలు ఆటోమేటిక్గా వైరల్ కాకుండా నిరోధించేలా మెటా అల్గారిథమ్లను పూర్తిగా మార్పులు చేయాలి.
*చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించమని ప్రభుత్వ అధీకృత ఏజెన్సీలు కోరినప్పుడు, తక్షణమే ఎలాంటి ఆలస్యం లేకుండా చాలా వేగంగా స్పందించి వాటిని తొలగించాలి.
*హానికరమైన పోస్టులను గుర్తించి, వాటిని ఏరిపారేసే వ్యవస్థలను (కంటెంట్ మోడరేషన్ సిస్టమ్స్) మరింత బలోపేతం చేయాలి.
*తప్పుడు సమాచారాన్ని, ఫేక్ కంటెంట్ను అడ్డుకోవడంలో ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలి.
*డేటా నిబంధనలు, భారతదేశం విధించిన డేటా-స్థానికీకరణ (Data Localization) అవసరాలకు తప్పకుండా కట్టుబడి ఉండాలి.
సమావేశంలో ఏం జరిగింది?
ఇటీవల MeitY అధికారులకు, మెటా సాంకేతిక బృందానికి మధ్య జరిగిన భేటీలో ఈ అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. మెటా ప్లాట్ఫారమ్లో హానికరమైన కంటెంట్ను అడ్డుకోవడానికి ప్రస్తుతం వాడుతున్న పద్ధతులను మెటా బృందం వివరించింది. అయితే, ఆ ఏర్పాట్లు సరిపోవని, డీప్ఫేక్ల కట్టడికి మరింత పటిష్టమైన, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ అధికారులు తేల్చిచెప్పారు.
ప్రస్తుత వ్యవస్థల్లోని లోపాలను మెటా కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ అంశంపై చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో ఇరుపక్షాల మధ్య మరోసారి సమావేశం జరగనుంది.
Government sources: "Ministry of Electronics and Information Technology (MeitY) has told Meta to revamp its algorithms and provide a compliance roadmap to fight deepfakes, propaganda, and other manipulated or illegal content on its platforms. Officials also asked Meta to tighten…
— ANI (@ANI) August 8, 2026
