హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణ ఆడ పడుచులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా సంఘాలకు రూ.2 వేల 500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు.. అందుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. ఈ ప్రకటనతో తెలంగాణలో డ్వాక్రా సంఘాల్లో కొనసాగుతున్న మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివెరిసింది.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీ లేని రుణాలను ప్రకటించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏండ్లకు పైబడిన 61 ఏండ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్పించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే.
ALSO READ : బడ్జెట్ బ్రేకింగ్ : ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆరోగ్య, విద్య అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇస్తున్నారు. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాలతో జీవనోపాధి పొందేందుకు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు.
