త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మే 15న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో త్రిగుణ్ మాట్లాడుతూ ‘ఇది ఫుల్ ఫన్ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే చక్కని కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్లో చూసి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. తెలుగులో వరుస సినిమాలు చేయడం సంతోషంగా ఉందని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చెప్పింది.
డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మనం రోజూ చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా సాగుతుంది. అలాగే అందమైన ప్రేమకథ ఉంటుంది. ఆ లవ్స్టోరీలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇందులోని క్లైమాక్స్ నిజ జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ సినిమా అందరి జీవితంలో గుర్తుండిపోతుంది’ అని చెప్పాడు. నిర్మాత అరవింద్ మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. చాలా క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది’ అని అన్నారు. మంచి కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నామని డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ చెప్పారు.
