హైదరాబాద్, వెలుగు: ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 2026–27 విద్యా సంవత్సరానికి టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా జరిగే అడ్మిషన్లు హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 14తో ముగియనున్న నేపథ్యంలో, పెండింగ్లో ఉన్న ప్రధాన రిట్ పిటిషన్ను ఆగస్టు 12న విచారించాలని సింగిల్ జడ్జికి సూచించింది.
ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ (ఈఓఏ) ఇవ్వడానికి ఏఐసీటీఈ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కాలేజీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. అడ్మిషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు.45 రోజులైనా ఏఐసీటీఈ కౌంటర్ దాఖలు చేయకపోవడం, చివరి దశలో అప్పీల్ దాఖలు చేయడంపై డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసును త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆగస్టు 7లోగా కౌంటర్ అఫిడవిట్, మధ్యంతర ఉత్తర్వుల రద్దు పిటిషన్ దాఖలు చేయాలని ఏఐసీటీఈని ఆదేశించింది. అనంతరం కాలేజీకి రీజాయిండర్ దాఖలు చేసే అవకాశం కల్పించి, ఆగస్టు 12న విచారణ పూర్తి చేసి కౌన్సెలింగ్ ముగిసేలోపు నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జిని కోరింది.
