అక్టోబర్ 1 నుంచి ఏజీగా ముకుల్‌ రోహత్గి..!!

అక్టోబర్ 1 నుంచి ఏజీగా ముకుల్‌ రోహత్గి..!!

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌(ఏజీ)గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఆయనే తదుపరి ఏజీ అంటూ ఇప్పటికే జోరుగా చర్చ సాగుతుండగా .. తాజాగా ఆయనే అక్టోబర్ 1 నుంచి అటార్నీ జనరల్ గా కొనసాగుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏజీగా కేకే వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆయన రిటైర్మెంట్‌ తర్వాత రోహత్గి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడం వల్ల 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్‌ పదవీకాలాన్ని పొడిగించడంతో.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో అది ముగియనుంది.

ఆయన ఈ పదవిలో దాదాపు 5ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. 2020లోనే వేణుగోపాల్‌ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్‌ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం ఆయన్ను మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని అభ్యర్థించడం వల్ల ఆయన కొనసాగారు. ఈ నేపథ్యంలో మరో సారి అటార్నీ జనరల్ గా ముకుల్‌ రోహత్గి అక్టోబర్‌ 1 నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.