ప్రధాని పదవి మిస్సైన ములాయం

ప్రధాని పదవి మిస్సైన ములాయం

ములాయం సింగ్ యాదవ్. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు. యూపీ అనగానే ములాయం పేరు గుర్తొచ్చేలా తన ముద్ర వేశారు. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా నేతాజీ అని పిలుచుకునేవారు. 

మల్లయోధుడైన ములాయం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అందుకే రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తృటిలో తప్పిపోయింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రధాని పదవికి దేవెగౌడ రాజీనామా చేసిన తర్వాత ములాయంకు పీఎం అయ్యే ఛాన్స్ దక్కింది. అయితే ఆయన ప్రత్యర్థులైన లాలూ ప్రసాద్, శరద్ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ఛాన్స్ మిస్సైంది. ఒకవేళ ఆయనకు ప్రధాని పదవి దక్కి ఉంటే గుజ్రాల్ కన్నా ఎక్కువ కాలం కూటమిని కాపాడేవారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించిన పార్టీలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. 80 లోక్ సభ స్థానాలున్న యూపీలో సమాజ్వాదీ పార్టీ  అత్యధిక స్థానాల్లో విజయం సాధించి థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ములాయం ప్రధాని అవుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అప్పట్లో ఎస్పీ కేవలం 5సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ములాయంకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.