మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. కోల్‎కతా‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. కోల్‎కతా‎లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ: దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే.. ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతోన్న వరుస సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‎కతా మీదుగా ముంబై వస్తోన్న ఎయిర్ ఇండియా AI 180 విమానంలో మంగళవారం (జూన్ 17) తెల్లవారుజూమున సాంకేతిక సమస్య తలెత్తింది. 

విమానం ఇంజిన్‎లో టెక్నికల్ ప్రాబ్లమ్ గుర్తించిన పైలట్లు.. ప్లయిట్‎ను కోల్‎కతాలో ల్యాండింగ్ చేశారు. భద్రతా దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.  AI 180 విమానంలోని లెఫ్ట్ ఇంజిన్‎లో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ముందుగానే సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు, ప్రయాణికులు, ఎయిర్ ఇండియా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.  

సోమవారం (జూన్ 16) కూడా ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. టెక్నికల్ ప్రాబ్లమ్‎తో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో సోమవారం (జూన్ 16) సాయంత్రం 6.20 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ ఢిల్లీ నుంచి బయలుదేరిన వెంటనే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని తిరిగి ఢిల్లీలోనే ల్యాండ్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విషాద ఘటన పూర్తిగా మరిచిపోకముందే.. అదే సంస్థ విమానాల్లో వరుసగా తలెత్తుతోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబెలెత్తిస్తున్నాయి.